ఫిబ్రవరి 6న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామంలో నిర్వహించనున్న కార్యక్రమానికి పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ పోలీసు అధికారులను ఆదేశించారు. సీఎం పర్యటన నేపథ్యంలో సభా ప్రాంగణం, హెలిప్యాడ్, సీఎం కాన్వాయ్ ప్రయాణించే మార్గాల్లో ఎలాంటి లోపాలు లేకుండా భద్రతా చర్యలు అమలు చేయాలని స్పష్టం చేశారు.
ట్రాఫిక్ నియంత్రణ, రూట్ బందోబస్తు అత్యంత కీలకమని పేర్కొంటూ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ప్రణాళికతో పని చేయాలని సూచించారు. క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది తమకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని ఆదేశించారు. మఫ్టీ పోలీసులు, ప్రత్యేక బృందాలు, బాంబ్ స్క్వాడ్ సహా అన్ని విభాగాలు సమన్వయంతో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
అనంతరం హెలిప్యాడ్ నుంచి సభా ప్రాంగణం వరకు సీఎం కాన్వాయ్ రిహార్సల్ ట్రయల్ రన్ను ఎస్పీ స్వయంగా పరిశీలించి భద్రతా అంశాలపై పర్యవేక్షణ చేశారు.
