రాయలసీమ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారంటూ వివిధ విద్యార్థి సంఘాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని, ఆరెకల్ సమీపంలో ఉన్న మెడికల్ కళాశాలను పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాలు నిర్వహిస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడాన్ని వారు తప్పుబట్టారు.
రాయలసీమ పశ్చిమ ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలుకాకపోవడం ప్రజలను తీవ్రంగా నిరాశకు గురిచేస్తోందని విద్యార్థి నాయకులు తెలిపారు. రెండు సంవత్సరాల పాలనలో రాయలసీమ అభివృద్ధికి ఏమి చేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని వారు ప్రశ్నించారు.
నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడం వల్ల నిరుద్యోగ యువత భవిష్యత్తు అంధకారంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ ప్రజల సమస్యలను పరిష్కరించకుండా ప్రాంతంలో పర్యటనలు చేయడం సరికాదని స్పష్టం చేస్తూ, తమ డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.
