మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నంద్యాల జిల్లా ఆత్మకూరు–శ్రీశైలం మార్గంలో భక్తుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ కోసం జిల్లా పోలీస్ శాఖ కీలక సూచనలు జారీ చేసింది. ఆత్మకూరు డీఎస్పీ రామంజి నాయక్ మాట్లాడుతూ, పాదయాత్రికులు రోడ్డుకు ఒక వైపున మాత్రమే నడవాలని, చిన్నపిల్లల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భారీ గూడ్స్ వాహనాలకు మార్గమార్పులు అమలు చేస్తూ, భక్తుల ప్రయాణానికి అంతరాయం కలగకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
జేబుదొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలని, విలువైన వస్తువులు భద్రంగా ఉంచుకోవాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం నిషేధమని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అటవీ మార్గాల్లో ప్రయాణించే భక్తులు ప్లాస్టిక్ వినియోగం చేయరాదని, వన్యప్రాణులకు హాని కలగకుండా పర్యావరణాన్ని కాపాడాలని తెలిపారు. పోలీసులకు సహకరిస్తే మహాశివరాత్రి యాత్రను ప్రశాంతంగా, సురక్షితంగా పూర్తిచేయవచ్చని ఆయన అన్నారు.