కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని ఎమ్మిగనూరు పట్టణంలో వెలిసిన శ్రీ అభయ ఆంజనేయస్వామి దేవాలయం (కోతుల బావి) సుమారు 300 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రాచీన దేవాలయం. ఇటీవల ఈ దేవాలయానికి సంబంధించిన భూమి వివాదం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ఈ సందర్భంగా జనసేన పార్టీ స్థానిక నాయకుడు చల్లా వరుణ్ మాట్లాడుతూ, బ్రిటిష్ పరిపాలన కాలంలో అప్పటి బళ్లారి జిల్లాలో భాగంగా ఉన్న ఎమ్మిగనూరులో ఈ దేవాలయానికి సుమారు 33 సెంట్ల భూమిని అధికారికంగా కేటాయించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ భూమిని మున్సిపాలిటీ అధికారులు ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయని ఆయన చెప్పారు.
మరోవైపు మున్సిపాలిటీ అధికారులు మాత్రం దేవాలయ పెద్దలే మున్సిపాలిటీ స్థలాన్ని ఆక్రమించారని వాదిస్తున్నారు. ఈ వివాదం మధ్యలో దేవాలయంలో ఉన్న కొన్ని విగ్రహాలను అధికారులు తొలగించడంతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గత నెల రోజులుగా ఎమ్మిగనూరు పట్టణంలో ఈ అంశంపై నిరసనలు కొనసాగుతున్నాయి.
కొంతమంది రాజకీయ నాయకులు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం దేవాలయానికి సంబంధించిన స్థలంలో షాపులు నిర్మించి తమ అనుచరులకు ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని జనసేన పార్టీ దృష్టికి తీసుకెళ్లినట్లు చల్లా వరుణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, దేవాలయ పెద్దలు మరియు హిందూ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
