ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ)లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. సంస్థలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న రెగ్యులర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అనుమతులు ఇవ్వాలని ఆర్టీసీ పాలకమండలి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు జరిగిన పాలకమండలి సమావేశంలో కీలక తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపినట్లు సమాచారం.
మొత్తం 7,673 రెగ్యులర్ పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వాలని కోరారు. ఇందులో 3,673 డ్రైవర్ పోస్టులు, 1,813 కండక్టర్ పోస్టులతో పాటు డిపోలలో ఖాళీగా ఉన్న మెకానిక్లు, శ్రామిక్లు, ఇతర సాంకేతిక, సహాయక విభాగాల పోస్టులు కూడా ఉన్నాయి. ఈ నియామకాల ద్వారా ఆర్టీసీ సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలన్నదే లక్ష్యంగా పేర్కొన్నారు.
అలాగే ఆన్కాల్ డ్రైవర్ల రోజువారీ వేతనాన్ని ప్రస్తుతం ఉన్న రూ.800 నుంచి రూ.1,000కు పెంచాలని నిర్ణయించారు. డబుల్ డ్యూటీ చేసే కండక్టర్లకు చెల్లిస్తున్న మొత్తాన్ని రూ.900కు పెంచేందుకు కూడా పాలకమండలి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాలు అమలైతే ఆర్టీసీ ఉద్యోగులకు ఊరట కలగడమే కాకుండా ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.
