భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపాడు అటవీ ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. వన్యప్రాణులను వేటాడేందుకు వేటగాళ్లు ఏర్పాటు చేసిన విద్యుత్ ఉచ్చులో చిక్కుకుని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO) బానోత్ నవీన్ మృతి చెందారు. విధి నిర్వహణలో భాగంగా అటవీ ప్రాంతంలో తనిఖీలకు వెళ్లిన అటవీశాఖ అధికారే విద్యుత్ ఉచ్చుకు బలవ్వడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
అటవీ ప్రాంతంలో కొందరు వ్యక్తులు అడవి జంతువుల వేట కోసం విద్యుత్ తీగలు అమర్చి ఉచ్చులు ఏర్పాటు చేసినట్లు సమాచారం అందడంతో అటవీశాఖకు చెందిన ఆరుగురు సిబ్బంది తనిఖీలకు వెళ్లారు. బూర్గంపాడు మండలం నకిరేపేట అటవీ ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో విద్యుత్ తీగలు ప్రమాదవశాత్తు బానోత్ నవీన్కు తగిలినట్లు అధికారులు తెలిపారు. విద్యుదాఘాతానికి గురైన ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.
బానోత్ నవీన్ ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం వెంకట తండాకు చెందిన వ్యక్తిగా అధికారులు గుర్తించారు. పాల్వంచ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని చెరువు సింగారం బీట్లో ఆయన విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విద్యుత్ ఉచ్చులు ఏర్పాటు చేసిన వ్యక్తులను గుర్తించేందుకు అటవీశాఖ, పోలీసు అధికారులు చర్యలు చేపట్టారు. వన్యప్రాణుల వేట కోసం అక్రమంగా ఏర్పాటు చేసే విద్యుత్ ఉచ్చులు జంతువులతో పాటు మనుషుల ప్రాణాలకు కూడా ఎంతటి ప్రమాదకరంగా మారుతున్నాయో ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది.
