సంగారెడ్డి జిల్లా ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు జిల్లా పోలీస్ శాఖ చేపడుతున్న ప్రజావాణి కార్యక్రమంకు విశేష స్పందన లభిస్తోంది. ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించి, వాటిపై వెంటనే చర్యలు ప్రారంభిస్తున్నట్లు అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, ఐపీఎస్ తెలిపారు. తాజా ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఫిర్యాదుదారులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలను ఓపికగా విన్నారు. అనంతరం సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి కేసుల వివరాలు తెలుసుకుని, ప్రతి ఫిర్యాదుపై నిష్పక్షపాత విచారణ జరిపి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
స్థానిక పోలీస్ స్టేషన్లలో సమస్యలు పరిష్కారం కాకపోయినా ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా, మధ్యవర్తుల అవసరం లేకుండా నేరుగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని అదనపు ఎస్పీ సూచించారు. ప్రజావాణి ద్వారా అందిన ప్రతి ఫిర్యాదుపై జిల్లా పోలీస్ కార్యాలయం ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగిస్తుందని, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలకు పారదర్శకంగా, వేగవంతంగా న్యాయం అందించడమే సంగారెడ్డి జిల్లా పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
